
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : మంచి సందేశంతో కూడిన చిత్రం నరకాసుర అని ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రమని, హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. శుక్రవారం విడుదలైన నరకాసుర చిత్రాన్ని నగరంలోని స్వర్ణప్యాలెస్ థియేటర్లో హీరో వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారని అన్నారు. నరకాసుల చిత్రం ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో కాఫీ, మిరియాల ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుందని అన్నారు. సమాజంలో ఎప్పటికపుడు కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుని చేస్తున్నానని ప్రేక్షకులు కూడా చక్కగా ఆదరిస్తున్నారని అన్నారు. నాది విజయవాడేనని ఇక్కడే పుట్టి పెరిగానని, సినిమా రంగంలో కూడా ఆదరణ మంచిగా ఉందని ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇంతకుముందు పలాస సినిమా చేశానని ఆ సినిమా కూడా ఆదరించారన్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలు చేశానని మంచి ఆదరణ లభించిందని అన్నారు. త్వరలో శశివదన సినిమా విడుదల కానుందని, తరువాత ఆపరేషన్ రావణ సినిమా కూడా షూటింగ్ జరుగుతుందని తెలిపారు. అనంతరం నగరంలోని ఎల్ఇపిఎల్ మాల్తో పాటు పలు థియేటర్లలో సినిమాను ప్రేక్షకులతో వీక్షించారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు.