
ప్రజాశక్తి-దేవరాపల్లి : జోనల్ స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో కాశీపురం జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మంగళవారం చోడవరంలో జరిగిన నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శన పోటీలలో కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన నాచుతో నాణ్యమైన పెట్రోల్ తయారీ ప్రాజెక్టు ప్రథమ స్థానం పొంది జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పిబిటి సుందరి తెలిపారు. ఈ ప్రాజెక్టు వలన రోజు రోజుకి కొరత ఏర్పడుతున్న శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఈ నాచుతో నాణ్యమైన పెట్రోల్ తయారీ ప్రాజెక్టును బయాలజీ ఉపాధ్యాయురాలు బుర్ర పూర్ణిమ పర్యవేక్షణలో విద్యార్థులు అనన్య, అఖిల్ తయారు చేసినట్లు చెప్పారు. వీరిని ఎంఈఓ -1 పడాల దాసు, ఎంఈఓ -2 ఉషారాణి, ప్రధానోపాధ్యాయిని పిబిటి.సుందరి, కొటాన రాంబాబు మాస్టారు, ఉపాధ్యాయులు అభినందించారు. వీరు 9వ తేదీ గురువారం కశింకోటలో జరిగే జిల్లా స్థాయి వైజ్ఞానిక పోటీలలో పాల్గొంటారని హెచ్ఎం తెలిపారు.